Nellore District: చనిపోయిన వ్యక్తిని బతికించేందుకు రూ. 8 లక్షలతో తాంత్రికుడి డీల్.. 40 రోజులు శ్మశానంలోనే కుటుంబం!

  • నెల్లూరు జిల్లా పెట్లూరులో ఘటన
  • 41 రోజులుగా శ్మశానంలో ఎదురుచూపులు
  • శ్మశానాన్ని ఖాళీ చేయమన్నందుకు గ్రామస్థులపై దాడి

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ తుపాకుల శ్రీనివాస్ 40 రోజుల క్రితం డెంగీతో మృతి చెందాడు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే, శ్రీనివాస్ మరణించడానికి ముందు రైల్వేకోడూరులో ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో అనుమానం తలెత్తింది. ఆ వ్యక్తి చేతబడి చేయడం వల్లే శ్రీనివాస్ మృతి చెందాడని బలంగా నమ్మారు.

చనిపోయిన శ్రీనివాస్‌ను ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబ సభ్యులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా క్షుద్రపూజలు చేసే ఓ తాంత్రికుడిని సంప్రదించారు. శ్రీనివాస్‌ను బతికిస్తానని అతడు హామీ ఇచ్చాడు. శ్రీనివాస్‌ను సమాధి చేసిన ప్రాంతంలో 41 రోజులు పూజలు చేయాలని, అందుకు రూ. 8 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. అయితే, ఆ 41 రోజులూ శ్మశానంలోనే శ్రీనివాస్‌ కోసం ఎదురు చూస్తూ ఉండాలని షరతు విధించాడు.

ఇక, అప్పటి నుంచి వారు శ్రీనివాస్ కోసం శ్మశానంలోనే పడిగాపులు కాస్తున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరితే వారిపైనే తిరగబడ్డారు. కత్తులతో బెదిరించారు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శ్మశానానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

  • Loading...

More Telugu News