Andhra Pradesh: ‘సమర శంఖారావం’ మోగించిన జగన్.. బూత్ స్థాయి కార్యకర్తలతో భేటీ కానున్న వైసీపీ అధినేత!

  • వచ్చే నెల 4 నుంచి టూర్ ప్రారంభం
  • కార్యకర్తలు, కన్వీనర్లను కలుసుకోనున్న జగన్
  • పార్టీ పటిష్టతపై వైసీపీ అధినేత దృష్టి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ జోరు పెంచారు. ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఏపీ అంతటా పర్యటించిన జగన్.. తాజాగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇందుకోసం ‘సమర శంఖారావం’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా జగన్ ఫిబ్రవరి 4న తిరుపతిలో, 5న కడప జిల్లాలో, 6వ తేదీన అనంతపురం జిల్లాలో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అవుతారు.

ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టత, ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, కార్యకర్తల అభిప్రాయం, ప్రజలు ఏమనుకుంటున్నారు? మొదలైన విషయాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అనంతరం కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కూడా బూత్ స్థాయి కమిటీల సమావేశాల్లో పాల్గొంటారు.

ఈ సమావేశాల తర్వాత బూత్ స్థాయి కన్వీనర్లతో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. వచ్చే నెల 14న అమరావతి సమీపంలోని తాడేపల్లిలో జగన్ గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో భేటీ అయ్యే అవకాశముంది.

More Telugu News