Bhanu Priya: పనిపిల్లను వేధించిందంటూ తనపై నమోదైన కేసుపై స్పందించిన సినీనటి భానుప్రియ

  • ఏడాదిగా సంధ్య పనిచేస్తోంది
  • రూ.లక్షన్నర దొంగిలించింది
  • నిలదీసి అడిగితే నిజం చెప్పింది
  • కొన్నింటిని వాళ్లమ్మ తెచ్చి ఇచ్చింది

సినీనటి భానుప్రియ తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని వేధించారంటూ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో నేడు కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై భానుప్రియ స్పందించారు. సంధ్య(14) అనే బాలిక తమ ఇంట్లో సంవత్సర కాలంగా పనిచేస్తోందని.. ఈ క్రమంలో దాదాపు రూ.లక్షా 50 వేల విలువైన డబ్బు, బంగారం, కెమెరా, ఐప్యాడ్‌ను దొంగిలించిందని చెప్పారు. ఈ విషయమై సంధ్యను నిలదీసి అడిగితే కానీ నిజం చెప్పలేదని.. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకెళ్లమని చెప్పినట్టు భానుప్రియ తెలిపారు.

సంధ్య తల్లి తన ఇంట్లో దొంగిలించిన కొన్ని వస్తువులను తెచ్చి ఇచ్చిందని.. మరికొన్నింటిని తీసుకొస్తానని వెళ్లి తనపైనే కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ అవాస్తవాలుగా కొట్టిపడేశారు. మరోవైపు బాలిక తల్లి ప్రభావతి.. తన కూతురిని భానుప్రియ చిత్రహింసలు పెట్టారని.. ఆమె సోదరుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఈ కేసును చైల్డ్‌లైన్ ద్వారా సామర్లకోట పోలీసులు చెన్నైకి బదిలీ చేశారు.

More Telugu News