Andhra Pradesh: జర్నలిస్టుపై చిందులు తొక్కిన జలీల్ ఖాన్.. కెమెరాను లాక్కున్న టీడీపీ నేత!

  • విజయవాడ కమిషనర్ ఆఫీసుకు వచ్చిన ఎమ్మెల్యే
  • చిత్రీకరించేందుకు యత్నించిన జర్నలిస్టు
  • టీడీపీ నేత దాడిచేశారన్న సంఘాలు

తెలుగుదేశం నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రెచ్చిపోయారు. తనను చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్టుపై దౌర్జన్యం చేయడమే కాకుండా కెమెరా లాక్కున్నారు. ఏపీలోని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కేసుకు సంబంధించి తనకు న్యాయం చేయాలంటూ జలీల్ ఖాన్ కోడలు మెహమూదా కమిషనర్ ను ఆశ్రయించారు.

దీంతో ఈ విషయంలో నచ్చజెప్పేందుకు ఇరువర్గాలను డీసీపీ రాజకుమారి ఈరోజు కమిషనర్ ఆఫీసుకు పిలిపించారు. దీంతో జలీల్ ఖాన్ కూడా కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను కెమెరాతో చిత్రీకరించేందుకు యత్నించిన ఓ జర్నలిస్టుపై జలీల్ ఖాన్ దౌర్జన్యానికి దిగారు. దీంతో పలు మీడియా సంఘాలు టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. జలీల్ ఖాన్ కెమెరాను లాక్కోవడంతో పాటు దాడిచేశారని ఆరోపించాయి. ఈ తతంగం అంతా అదనపు డీసీపీ నవాబ్ జాన్, సీఐ ఉమా మహేశ్వరరావు సమక్షంలోనే జరిగిందని విమర్శించాయి.

More Telugu News