Jagan: వైసీపీ అధినేత జగన్ తో సమావేశమైన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి!

  • సోదరులతో కలిసి జగన్ తో భేటీ
  • ఈ నెల 31న అధికారికంగా చేరిక
  • రాజీనామా చేసి రావాలన్న జగన్

టీడీపీ బహిష్కృత నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి తన సోదరులతో కలిసి మేడా చేరుకున్నారు. ఆయన్ను వైసీపీ నేత విజయసాయిరెడ్డి లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, కడప జిల్లా రాజకీయాలపై ఆయన జగన్ తో చర్చించారు. మేడా ఈరోజు జగన్ ను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారనీ, ఈ నెల 31న అధికారికంగా వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.

ఈ నెల 31న మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని జగన్ సూచించినట్లు పేర్కొన్నాయి. ఈరోజు రాజంపేట, జమ్మలమడుగు నేతలతో అమరావతిలో చంద్రబాబు నిర్వహించిన భేటీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ కార్యకర్తలు, నేతల డిమాండ్ నేపథ్యంలో మేడాను చంద్రబాబు సస్పెండ్ చేశారు.

More Telugu News