Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేస్తా!: ఎమ్మెల్యే జలీల్ ఖాన్

  • రాజకీయాల్లో రిటైర్మెంట్ అన్నది ఉండదు
  • కుమార్తెకు సీటు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు
  • విజయవాడ వెస్ట్ లో భారీ మెజారిటీతో గెలుస్తాం

రాజకీయాల్లో రిటైర్మెంట్ అన్నది ఉండదని టీడీపీ నేత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి బాధ్యత ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కుమార్తె షబానా ఖాతూర్ తో కలిసి జలీల్ ఖాన్ ఈరోజు అమరావతిలో చంద్రబాబును కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు విజయవాడ వెస్ట్ సీటు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కన్నా పేరులోనే కన్నం ఉందనీ, ప్రజల సొమ్మును కాజేసి నీతులు చెబుతున్నాడని జలీల్ ఖాన్ విమర్శించారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేస్తానని ప్రకటించారు. తన కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా టీడీపీ కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ వెస్ట్ లో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో తన కుమార్తెను భారీ మెజారిటీతో గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News