Andhra Pradesh: జలీల్ ఖాన్ కుమార్తెకు విజయవాడ వెస్ట్ టికెట్.. ప్రకటించిన సీఎం చంద్రబాబు!

  • సీఎం చంద్రబాబుకు నా ధన్యవాదాలు
  • వంగవీటి రాధకు ఎమ్మెల్సీ సీట్ గ్యారెంటీ
  • నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానన్న టీడీపీ నేత

 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటును ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ కు ఇవ్వాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా జలీల్ ఖాన్ కు తెలియజేశారు. దీంతో ఆయన సంతోషంలో మునిగిపోయారు. ఈ విషయమై జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ వెస్ట్ టికెట్ ను తన కుమార్తెకు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు.

తొలిసారి ఓ మైనారిటీ మహిళకు చంద్రబాబు టికెట్ ఇచ్చారనీ, ఇందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరబోతున్నారనీ, ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖరారయిందని వ్యాఖ్యానించారు.

రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై గెలుపొదిన జలీల్ ఖాన్, ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో బీకామ్ డిగ్రీ కోర్సులో ఫిజిక్స్ సబ్జెక్టు ఉంటుందని చెప్పి జలీల్ ఖాన్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.

More Telugu News