Andhra Pradesh: కర్నూలు అసెంబ్లీ సీటు నాదే.. చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉంది!: ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

  • సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయి
  • పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నాను
  • రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయం

కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం ఇటు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్, అటు ఎస్వీ మోహన్ రెడ్డి నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో మరోసారి టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరొకరికి చంద్రబాబు టికెట్ ఇవ్వరని స్పష్టం చేశారు.

పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సర్వేల్లో తనకే ఎక్కువ అనుకూలత ఉన్నట్లు తేలిందని మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసన్నారు. కర్నూలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ తన ఆధ్వర్యంలోనే సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమనీ, సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, కర్నూలు స్థానంపై టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ గంపెడాశలు పెట్టుకున్నారు.

More Telugu News