Vishnukumar Raju: పవన్ కల్యాణ్ గాలి మారింది... మరికొన్ని రోజుల్లో చంద్రబాబు ఇంకో యూటర్న్: విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

  • ట్విస్ట్ లు ఇవ్వడంలో టీడీపీ నంబర్ వన్
  • నేను బీజేపీకి రాజీనామా చేస్తానన్న వార్తలు అసత్యం
  • బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు

తాను బీజేపీకి రాజీనామా చేసి, పార్టీ మారనున్నట్టు వచ్చిన వార్తలపై ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, కొందరు నాయకులు బీజేపీని వీడినంత మాత్రాన 40 లక్షల మంది సభ్యులున్న పార్టీకి ఏమీ కాబోదని అన్నారు.

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగుదేశం పార్టీ నేతలు పవన్‌ కల్యాణ్ ను విమర్శించడం మానేశారని, ఆపై పవన్‌ గాలి కూడా కాస్త మారినట్లు అనిపిస్తోందని అన్నారు. అతి త్వరలోనే చంద్రబాబు తీసుకునే మరో యూటర్న్ ను చూడనున్నామని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

ట్విస్ట్ లు ఇవ్వడంలో టీడీపీ నంబర్ వన్ అని ఎద్దేవా చేసిన ఆయన, కేంద్రం ఇవ్వలేదని ఆరోపిస్తూ, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టులకు శంకుస్థాపనలు చేసిన చంద్రబాబు, రేపు రైల్వేజోన్‌ ను సొంతంగా ప్రకటించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సెటైర్ వేశారు. ఎన్నికలు వస్తున్నాయనే పెన్షన్ల మొత్తాన్ని పెంచారని ఆరోపించారు. తాను ఎన్నో అవినీతి కుంభకోణాలను బయట పెట్టానని, అసెంబ్లీలో పోరాడానని, తనను తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని చెప్పారు. ఎన్నికల్లో తాను ఓడిపోయి ఇంట్లో ఉంటే, ఆ నష్టం ప్రజలకేనని అన్నారు.

More Telugu News