కేసీఆర్: ప్రారంభమైన కేసీఆర్ 'సహస్ర మహా చండీయాగం'

  • ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సహస్ర మహా చండీయాగం
  • హాజరైన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • 300 మందికి పైగా రుత్విక్కులు ఈ యాగాల్లో పాల్గొంటున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే సహస్ర మహా చండీయాగం ఈరోజు ఉదయం 11 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం, రుత్విక్ వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షిణ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని రుత్విక్కులు పూజలు చేశారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 300 మందికి పైగా రుత్విక్కులు ఈ యాగాల్లో పాల్గొంటున్నారు.

More Telugu News