chiranjeevi: ఈ కాంబినేషన్లో మొదటి సినిమా పడటం వైష్ణవ్ తేజ్ అదృష్టం: చిరంజీవి

  • మైత్రీ వారితో అనుబంధం పెరిగింది
  • సుకుమార్ మంచి మనసున్న మనిషి  
  • బుచ్చిబాబు గురించి నేను విన్నాను    

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా, ఆయన తొలి చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ రోజున సెట్స్ పైకి వెళ్లింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది. ఆ తరువాత చిరంజీవి మాట్లాడుతూ .. "సుకుమార్ మంచి మనసున్న మనిషి .. ఆయన నిర్మాతగా కొత్త టాలెంట్ ను వెలికి తీసే దిశగా ముందుకు సాగుతున్నందుకు అభినందిస్తున్నాను.

మైత్రీ వారితో నేను సినిమా చేయలేదుగానీ, చరణ్ ద్వారా వీరితోను .. సుకుమార్ తోను నాకు అనుబంధం పెరిగింది. అందువలన వాళ్లు నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇలాంటి కాంబినేషన్లో తొలి సినిమా చేసే అవకాశం మా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి రావడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతూ, వైష్ణవ్  తేజ్ కి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

దర్శకుడు బుచ్చిబాబు నాకు కథను చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. 'రంగస్థలం' కథా చర్చల్లో బుచ్చిబాబు పాత్ర ఎంతో ఉందని సుకుమార్ నాకు చెప్పుకొచ్చారు. అలాంటి బుచ్చిబాబు ఈ సినిమాను అందరినీ ఆకట్టుకునేలా చిత్రీకరిస్తారనడంలో నాకు ఎలాంటి సందేహంలేదు. ఈ సందర్భంగా నేను బుచ్చిబాబును అభినందిస్తున్నాను" అని అన్నారు.      

More Telugu News