nepal: నేపాల్‌, భూటాన్‌ వెళ్లాలంటే ఇకపై వీరికి 'ఆధార్' కూడా ఉపయోగపడుతుంది!

  • కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ
  • పాస్‌పోర్టు, ఓటరు కార్డు, పాన్‌ కార్డుకు అదనంగా చేరిక
  • అయితే 16 నుంచి 64 ఏళ్లలోపు వారు అనర్హులు

మన పొరుగు దేశాలు, పర్యాటక ప్రాంతాలైన నేపాల్‌, భూటాన్‌కు భారతీయులు వెళ్లాలనుకుంటే ఇకపై ఆధార్‌ గుర్తింపు కార్డు కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండు దేశాలకు వెళ్లాలంటే వీసా అవసరం లేని విషయం తెలిసిందే.  పాస్‌పోర్టు, ఓటరు కార్డు, పాన్‌ కార్డు ఉంటే సరిపోతుంది.

అలాగే 15 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులను ఆయా పాఠశాలలు ఇచ్చే గుర్తింపు కార్డుతో కూడా అనుమతిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి గుర్తింపు కార్డున్నా అందరూ ప్రయాణించే అవకాశం ఉంది. వీటికి అదనంగా ఇప్పుడు ఆధార్‌ చేర్చారు.  ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే 15 ఏళ్లలోపు విద్యార్థులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అంటే 16 నుంచి 64 ఏళ్లలోపు వారు దీన్ని గుర్తింపు పత్రంగా వినియోగించడానికి వీలులేదు.

అలాగే ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ఇచ్చే రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం ఆధారంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో ప్రయాణించే అవకాశం ఉండేది. తాజాగా దీన్ని రద్దు చేశారు. కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ఓ వైపు వినియోగించుకునేందుకు దీన్ని అనుమతిస్తారు.

More Telugu News