Krishnamraju: ప్రభాస్ పెళ్లిపై స్పందించిన కృష్ణంరాజు!

  • 'సాహో' తరువాత ప్రభాస్ పెళ్లి
  • త్వరలోనే ప్రభాస్, నేను కలిసి తెరపై కనిపిస్తాం
  • పుట్టినరోజు సందర్భంగా కృష్ణంరాజు

తనను ప్రభాస్ వివాహం గురించి చాలా మంది అడుగుతున్నారని, 'సాహో' సినిమా విడుదల కాగానే ఆ వేడుక ఉంటుందని రెబల్ స్టార్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. 'బాహుబలి' తరువాత తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి పెరిగిందని అన్నారు. నేడు కృష్ణంరాజు పుట్టినరోజు కావడంతో, ఓ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విశేషాలను పంచుకున్నారు.

 తాను 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని, అప్పట్లో హీరోల మధ్య ఎటువంటి సత్సంబంధాలుండేవో, ఇప్పుడు మహేశ్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ల మధ్య అటువంటి సంబంధాలే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. త్వరలోనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో లవ్ స్టోరీ నిర్మిస్తామని, అందులో తాను కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. ఇటీవల తాను చూసిన సినిమాల్లో 'మహానటి' అద్భుతంగా వుందని చెప్పారు. తనకు ఎస్వీ రంగారావు బయోపిక్ ను చూడాలని ఉందని, ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తే బాగుంటుందని చెప్పారు.

గతంలో బీజేపీ తరఫున కర్ణాటకలో ప్రచారం చేశానని గుర్తు చేసిన ఆయన, ఆంధ్రాలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, అధిష్ఠానం అడిగితే వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. ఈ సంక్రాంతికి సొంత ఊరిలో ఉండాలని అనుకున్నానని, అయితే, పార్టీ పనిపై ఢిల్లీ వెళ్లడంతో కుదర్లేదని కృష్ణంరాజు అన్నారు. తాను పుట్టినరోజు ఫంక్షన్స్ అంటూ ప్రత్యేకించి ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోబోనని, అయితే, నటుడిగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని, సుదీర్ఘకాలంగా తమతో ప్రయాణిస్తున్న ఫ్యాన్స్ ను సన్మానించాలని భావిస్తున్నానని, వివరాలు త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.

More Telugu News