Australia: ‘త్రీ లెజెండ్స్, వన్ ఫొటో’పై నెటిజన్ల విమర్శలు!

  • మెల్ బోర్న్ పార్క్ ను సందర్శించిన కోహ్లీ జంట
  • టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ తో కలిసి ఫొటోలు దిగిన వైనం
  • ఓ ఫొటోను పోస్ట్ చేసిన ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్, వన్ డే సిరీస్ లను కైవసం చేసుకున్న భారతజట్టుకు అభినందనలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆసీస్ ని వారి సొంత గడ్డపై ఓటమి పాలు చేసిన విరాట్ కోహ్లీ సేన సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ అపూర్వ విజయాన్ని భారత్ ఆటగాళ్లు అక్కడే గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ అయితే తన భార్య అనుష్కతో కలిసి తిరుగుతూ సంతోషాన్ని పంచుకుంటున్నాడు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న మెల్ బోర్న్ పార్క్ ను కోహ్లీ జంట ఈరోజు సందర్శించింది. టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ని వీళ్లిద్దరూ కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈ ముగ్గురు కలిసి దిగిన ఓ ఫొటోను ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ ‘త్రీ లెజెండ్స్, వన్ ఫొటో’ అనే క్యాప్షన్ ని జోడించింది. ఈ క్యాప్షన్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే, ఫెదరర్, కోహ్లీతో ఉన్నంత మాత్రాన అనుష్క ‘లెజెండ్’ అయిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు.


More Telugu News