Haryana: పెళ్లి చేసుకోనందుకు కేసు పెట్టిన యువతి.. లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపిన ప్రియుడు!

  • హరియాణాలోని గురుగ్రామ్ లో ఘటన
  • యువతితో సందీప్ సహజీవనం
  • వివాహానికి మొహం చాటేసిన యువకుడు

ఓ యువతితో సహజీవనం చేసిన యువకుడు పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేశాడు. దీంతో యువతి అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో జైలు నుంచి విడుదలైన సదరు యువకుడు మారిపోయినట్లు నటించాడు. యువతితో స్నేహంగా ఉంటూ లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లాడు. అనంతరం కిరాతకంగా చంపి తన పగను తీర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన హరియాణాలో గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.

గురుగ్రామ్ లోని ఓ బార్ లో డ్యాన్సర్ గా పనిచేస్తున్న యువతికి అక్కడే బౌన్సర్ గా ఉంటున్న సందీప్ తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ 2016 నుంచి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఏడాది తర్వాత పెళ్లి చేసుకుందామని యువతి చెప్పగా, సందీప్ అందుకు అంగీకరించలేదు. దీంతో 2017లో ఆమె సందీప్ పై అత్యాచారం కేసు పెట్టింది.

పోలీసులు సందీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన సందీప్ తాను మారిపోయినట్లు నటించాడు. లాంగ్ డ్రైవ్ కు వెళదామని ఆమెను పిలిచి, ఖుష్బూ చౌక్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే తుపాకీతో కాల్చి చంపి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News