Meghalaya: 32 రోజులుగా మేఘాలయ గనిలో చిక్కుకున్న 15 మంది గని కార్మికులు.. ఓ మృతదేహం లభ్యం

  • నెల రోజులుగా గనిలోనే ఉన్న మైనర్లు
  • ఈ తెల్లవారుజామున కార్మికుడి మృతదేహం వెలికి తీత
  • కోటి లీటర్ల నీటిని తోడినా ఫలితం శూన్యం

మేఘాలయలోని ఓ గనిలో నెల రోజులుగా చిక్కుకుపోయిన 15 మంది గని కార్మికులను వెలికి తీసుకొచ్చేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున ఓ కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. గనిలో 200 అడుగుల లోపల అతడి మృతదేహాన్ని గుర్తించి సహాయక సిబ్బంది దానిని వెలికి తీసుకొచ్చారు. మిగతా 14 మంది కోసం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 
నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. మంగళవారం మైనర్ మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది ఈ ఉదయం డైవర్ల సాయంతో వెలికి తీశారు. గనిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఇప్పటి వరకు కోటి లీటర్ల నీటిని బయటకు తోడినా ఫలితం లేకుండా పోయింది. నీటిని ఎంత తోడినా మళ్లీ పెరుగుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు అధికారులు తెలిపారు.  సమీపంలోనే మూసివేసిన గని నుంచి మరో రెండు కోట్ల లీటర్ల నీటిని బయటకు పంప్ చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ నీటి ప్రవాహం తగ్గడం లేదని, నీరు ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మేఘాలయలోని ఈస్ట్ జైంటియా జిల్లాలో లిటీన్ నది సమీపంలో అక్రమంగా నడుస్తున్న గనిలో కార్మికులు చిక్కుకుపోయారు. డిసెంబరు 13న ఈ ఘటన జరగ్గా..  విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అధికారులు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు.

More Telugu News