jagan: ఇది ప్రారంభ సమావేశం మాత్రమే: విజయసాయిరెడ్డి

  • ఫెడరల్ ఫ్రంట్ పై జగన్, కేటీఆర్ చర్చించారు
  • కేంద్రంతో పోరాడేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఒక వేదిక
  • ప్రత్యేక హోదా ఇచ్చేవారికి వైసీపీ మద్దతిస్తుంది

వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా జరిగిన తొలి సమావేశం మాత్రమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై ఇద్దరు నేతలు చర్చలు జరిపారని... త్వరలో జగన్ తో స్వయంగా కేసీఆర్ చర్చిస్తారని చెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో పోరాడేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ కేవలం టీఆర్ఎస్, వైసీపీలది మాత్రమే కాదని... వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇందులో భాగస్వామి అవుతాయని విజయసాయి తెలిపారు. ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయబోదని చెప్పారు. ఫ్రంట్ కు మద్దతుగా ఉన్నవారికి మద్దతుగా ఫెడరల్ ఫ్రంట్ ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారికి వైసీపీ మద్దతు ఉంటుందని చెప్పారు.

More Telugu News