Chandrababu: చేనుగట్టు సరిచేసుకోవడం నేరమా?: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

  • రైతులపై అన్యాయంగా కేసులు పెట్టారు
  • పెనాల్టీలు రాయడం కరెక్టు కాదు
  • సంఘటనా స్థలానికి వచ్చి చూడమన్నా సబ్ కలెక్టర్ పట్టించుకోలేదు

ఓ రైతుకు చెందిన ప్రొక్లెయినర్ ను స్వాధీనం చేసుకుని, భారీ జరిమానా విధించిన సంఘటనలో విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబుకి టీడీపీ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈరోజు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు చంద్రబాబు వద్దకు వెళ్లానని చెప్పారు. అక్కడి పత్రికల్లో వచ్చిన వార్తలను అనుసరించి సదరు రైతుపై కేసు పెట్టి, వోల్టా చట్టం పెట్టాలనడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు.

రైతు ఎవరైనా సరే, తమ చేను గట్టు సరిచేసుకోవాలంటే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని లేకపోతే చర్యలు తీసుకుంటారన్న విషయం అక్కడి రైతులకు తెలియదని అన్నారు. ఈ విషయం తెలియని రైతులపై అన్యాయంగా కేసులు పెట్టి, లక్షల రూపాయల పెనాల్టీ రాయడం కరెక్టు కాదని సబ్ కలెక్టర్ తో అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

రైతు తన చేనుగట్టు సరిచేసుకోవడంలో నేరమేంటో తనకు అర్థం కాలేదని అన్నారు, నిజంగా, ఆ రైతు తప్పు చేసి ఉంటే, అతని తరపున తాను పెనాల్టీ కడతాను, సంఘటనా స్థలానికి వచ్చి చూడమని సబ్ కలెక్టర్ తో చెప్పానని.. ఇందుకు సంబంధించిన ఫొటో గ్రాఫ్స్ చూశానని, అది తప్పేనని ఆమె అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇక్కడి నుంచి ఆ రైతు మట్టిని తీసుకెళ్లడం కానీ, ఆక్రమించుకోవడం వంటివి చేస్తే తప్పని, సంఘటనా స్థలానికి వెళ్లి చూద్దామని చెప్పినా ఆమె పట్టించుకోలేదని అన్నారు. 

More Telugu News