Telugudesam: జగన్ కు సీఎం కుర్చీ దక్కదు.. వెంకటేశ్వరస్వామి కూడా ఇవ్వడు: ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి

  • ఏపీ విషయమై మోదీని జగన్ ఎందుకు ప్రశ్నించరు?
  • అంటే, ఏపీలో జగన్  పుట్టలేదా?
  • ఏపీ ప్రజలు నీవాళ్లు కాదా?

జగన్ కు సీఎం కుర్చీ దక్కదని, ఆ అవకాశం వేంకటేశ్వరస్వామి కూడా ఆయన ఇవ్వడని ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీని జగన్ ఎందుకు ప్రశ్నించరు? ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదా, నిధుల గురించి, పరిశ్రమల గురించి గానీ, మిగిలిన అంశాలపైనా ఎందుకు ప్రశ్నించరని ధ్వజమెత్తారు.

అంటే, ఏపీలో జగన్ పుట్టలేదా? ఏపీ ప్రజలు నీవాళ్లు కాదా? అని ప్రశ్నించారు. తన పాదయాత్ర ముగిసిన సందర్భంగా జగన్ నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం పైనా ఆయన విమర్శలు గుప్పించారు. వెంకటేశ్వర స్వామిని మొక్కినా సరే జగన్ కు సీఎం కుర్చీ దక్కదని వ్యాఖ్యానించారు. ప్రజల దీవెనలు తమ ప్రభుత్వానికే ఉన్నాయని కేఈ చెప్పారు.

More Telugu News