moin khureshi: మొయిన్ ఖురేషీ కేసు నుంచి రాకేశ్ అస్థానాను తప్పించడం కుదరదు: ఢిల్లీ హైకోర్టు

  • రాకేశ్ అస్థానా వేసిన పిటిషన్ కొట్టివేత
  • ఈ కేసు దర్యాప్తు జరిపించాల్సిందే
  • పది వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు

మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషి కేసు నుంచి తనను తప్పించాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్థానా, సీబీఐ డిప్యూటీ ఎస్పీ దేవేందర్ కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ లపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టి వేసేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తు జరిపించాల్సిందేనని, పది వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

కాగా, అస్థానాపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో అస్థానాను అరెస్టు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, మొయిన్ ఖురేషీ కేసులో తనను తప్పించేందుకు ఓ మధ్యవర్తి ద్వారా రాకేశ్ అస్థానాకు తాను లంచం ఇచ్చిన విషయాన్ని హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సతీశ్ బాబు బయటపెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.

More Telugu News