Tamilnadu: ఇంట్లోనే నకిలీ యూనివర్సిటీ.. 1,000 మంది విద్యార్థులకు మెడికల్ డిగ్రీల జారీ!

  • తమిళనాడులోని నాగపట్నంలో ఘటన
  • ఏడేళ్లుగా సాగుతున్న వ్యవహారం
  • అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న బాధితులు

సాధారణంగా కొందరు మోసగాళ్లు ప్రింటింగ్ ప్రెస్సులు, టెక్నాలజీ సాయంతో నకిలీ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి దొంగ సర్టిఫికెట్లు జారీచేస్తూ ఉంటారు. వీటివల్ల చాలామంది సామాన్యులు నష్టపోతూ ఉంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా నకిలీ విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేశాడు. దండిగా నగదు వసూలు చేయడంతో పాటు వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీచేశాడు. చివరికి ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది.

తమిళనాడులోని నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్‌’ పేరుతో ఇంట్లోనే ఓ యూనివర్సిటీని స్థాపించాడు. ఇదే పేరుతో గత ఏడేళ్లుగా దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులకు మెడికల్ డిగ్రీ పట్టాలు జారీచేశాడు. అయితే ఈ వ్యవహారంపై విద్యార్థులతో పాటు అధికారులకు సైతం ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఇటీవల తనిఖీల సందర్భంగా ఈ విశ్వవిద్యాలయం జారీచేస్తున్న సర్టిఫికెట్లపై వైద్య శాఖ ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు యూనివర్సిటీ అడ్రస్ కు వెళ్లి విస్తుపోయారు. ఎందుకంటే ఓ ఇంటి అడ్రస్ తో సెల్వరాజ్ ఈ దొంగ విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిపై దాడి చేసిన అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఏడేళ్ల పాటు నడిచిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

More Telugu News