bode prasad: కృష్ణా జిల్లాలో రాళ్లతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు

  • కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమం
  • ఎమ్మెల్యే బోడె వాహనాన్ని అడ్డుకున్న పార్థసారథి అనుచరులు
  • ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లు సభను నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చేందుకు వైకాపా నేత పార్థసారథి యత్నించారు. నిన్న ఉయ్యూరులో జరిగిన సభలో బోడె ప్రసాద్, పార్థసారథిల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో పెదఓగిరాలలో కూడా ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆ గ్రామానికి వచ్చే మార్గంలో ఉన్న జాతీయ రహదారిపై భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ వద్దకు వచ్చేందుకు అక్కడకు చేరుకున్న పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు, సభ నుంచి వెళ్లిపోయేందుకు బోడె ప్రసాద్ తన అనుచరులతో కలసి జాతీయ రహదారిపైకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ వాహనాన్ని పార్థసారథి అనుచరులు అడ్డుకుని, వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో, మరోసారి ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని వారించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి అందరినీ పంపించివేశారు.

More Telugu News