Krishnagiri: ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోందని.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు!

  • కర్ణాటకలోని కృష్ణగిరిలో ఘటన
  • ప్రియురాలికి డబ్బిచ్చేందుకు వెళ్లిన దౌలత్
  • నీకెందుకని ప్రశ్నించినందుకు హత్య

సెల్వి... వయసు 32 సంవత్సరాలు. వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉండగా, భర్తతో విభేదాలతో దూరంగా ఉంటున్న ఆమెకు దౌలత్ పరిచయమయ్యాడు. అతని వయసు 24. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దౌలత్ మనసులో తలెత్తిన అనుమానం సెల్వి దారుణ హత్యకు కారణమైంది. కర్ణాటకలోని కృష్ణగిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

గౌండనూర్‌ కొటాయ్‌ గ్రామానికి చెందిన సెల్వి.. కృష్ణగిరి, జక్కప్పన్‌ నగర్‌ లోని ఓ దుకాణంలో పనిచేస్తూ హత్యకు గురైంది. ఆపై నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయి, తాను హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు. గతంలో సెల్వీ, దౌలత్ లు కావేరి పట్టణంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తుండేవాళ్లు. ఆ సమయంలో వారి మధ్య పరియచం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వయసు అంతరాన్ని ఇద్దరూ పట్టించుకోలేదు.

అప్పటి నుంచీ తాను సంపాదించిన డబ్బంతా సెల్వికే ఇస్తుండేవాడు దౌలత్. ఈ క్రమంలో శనివారం నాడు ఫోన్ చేసిన సెల్వి రూ. 2 వేలు కావాలని అడిగింది. ఆమెకు డబ్బిచ్చేందుకు దుకాణం వద్దకు వెళ్లాడు దౌలత్. అప్పుడామె ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది. దీంతో దౌలత్ ఆమెను నిలదీశాడు. తాను ఎవరితోనైనా మాట్లాడతానని, అది నీకు అనవసరమని సెల్వి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో, అక్కడే వున్న కత్తితో ఆమెను నరికి చంపాడు. అనంతరం తానే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని రిమాండ్ కు పంపామని పోలీసులు తెలిపారు.

More Telugu News