Vikarabad District: నీటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్.. వికారాబాద్ జిల్లాలో కలకలం

  • నామినేషన్ వేయాల్సిన విశ్వనాథ్ కిడ్నాప్
  • పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
  • బాధిత కుటుంబ సభ్యులను కలిసిన రేవంత్ రెడ్డి

పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం నీటూరులో కలకలం రేగింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయాల్సిన విశ్వనాథ్ అదృశ్యమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి పశువులకు మేత వేసేందుకు వెళ్లిన ఆయన కిడ్నాప్‌నకు గురైనట్టు విశ్వనాథ్ భార్య నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి గేటుకు ఉన్న విద్యుత్ బల్బును తొలగించి కిడ్నాప్‌కు పాల్పడినట్టు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వనాథ్ గెలుపొందారు. విశ్వనాథ్ కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గ్రామానికి చేరుకుని విశ్వనాథ్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణకు ఫోన్‌లో విషయాన్ని వివరించి విశ్వనాథ్ ఆచూకీ కనిపెట్టాలని కోరారు. నిర్మల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News