Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ వైఫల్యమే వైఎస్ జగన్ పాదయాత్ర సక్సెస్ కు కారణం!: కమెడియన్ పృథ్వి

  • ప్రజలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు
  • వైఎస్ లేని లోటును భర్తీ చేస్తాడని నమ్మారు
  • ఇచ్ఛాపురంలో మీడియాతో మాట్లాడిన నటుడు

మన సమస్యలు తీర్చే ప్రజానాయకుడు వచ్చాడన్న ఉత్సాహంతో ప్రజలు జగన్ వెంట ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్నారని ప్రముఖ సినీనటుడు పృథ్వి తెలిపారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి లక్షలాది మంది జగన్ తో కలిసి అడుగులో అడుగు వేశారని వ్యాఖ్యానించారు. జగన్‌ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని  అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటును జగన్ తీరుస్తారన్న భరోసా ప్రజలకు కలిగిందని పేర్కొన్నారు. ఇచ్ఛాపురంలో ఈరోజు పృథ్వి మీడియాతో మాట్లాడారు.

ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్‌ వెంట నడిచారని పృథ్వి అన్నారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్‌ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరో నటుడు కృష్ణుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని తెలిపారు. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యల గురించి చెప్పుకున్నారని గుర్తుచేశారు. పాదయాత్రలో వైఎస్ జగన్‌ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు.

More Telugu News