gold quest nest: గోల్డ్ క్వెస్ట్ నెస్ట్, క్యూనెట్ మోసం కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు!

  • లక్షల మందిని మోసం చేసిన నిందితులు
  • గోల్డ్ క్వెస్ట్ నెస్ట్, క్యూ నెట్ పేరుతో భారీ మోసాలు
  • 58 మంది నిందితులు రిమాండ్ కు తరలింపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోల్డ్ క్వెస్ట్ నెస్ట్, క్యూ నెట్ మోసం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. లక్షల మందిని మోసం చేస్తూ కోట్లాది రూపాయలను దోచుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సైబరాబాద్ పోలీసులు ఈరోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ, గోల్డ్ క్వెస్ట్ నెస్ట్, క్యూ నెట్ పేరుతో నిందితులు భారీ మోసాలకు పాల్పడుతున్నారని  పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలను క్యూనెట్ మోసగాళ్లు వసూలు చేశారని అన్నారు. అలా సేకరించిన డబ్బులతో వస్తువులు ఇస్తామంటూ చైన్ బిజినెస్ చేస్తున్నారని చెప్పారు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారని, ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ రంగంలోకి దిగి నిందితులను పట్టుకుందని వివరించారు. ఇప్పటి వరకు క్యూనెట్ మోసంపై 14 కేసులు నమోదు చేశామని, దేశ వ్యాప్తంగా క్యూనెట్ అకౌంట్లను  సీజ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబయిలోని క్యూనెట్ గోదాములను సీజ్ చేశామని, అరెస్టు చేసిన 58 మంది నిందితులను రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు.

More Telugu News