Chandrababu: బాబు గారూ! మీరు గోబెల్స్ ప్రచారానికి పరాకాష్టగా నిలిచారు: కన్నా విమర్శలు

  • రిపబ్లిక్ వేడుకల్నీ రాజకీయానికి వాడుకుంటున్నారు
  • శకటం సరైన నమూనాలో లేకపోతే తిరస్కరిస్తారు
  • వైఎస్, కిరణ్ టైంలో కూడా శకటం రిజెక్టయింది

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం లేకుండా చేయడం వివక్షేనని సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చివరకు, రిపబ్లిక్ డే వేడుకలను కూడా రాజకీయాలకు వాడుకుని గోబెల్స్ ప్రచారానికి పరాకాష్టగా చంద్రబాబు నిలిచారని దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

‘బాబు గారు, మీరు రిపబ్లిక్ వేడుకల్ని కూడా రాజకీయానికి వాడుకుని గోబెల్స్ ప్రచారానికి పరాకాష్టగా నిలిచారు. శకటం సరైన నమూనాలో లేకున్నా సరైన ప్రమాణాలు పాటించకున్నా, ఆలస్యంగా పంపినా కమిటీ రిజెక్ట్ చేస్తుంది. వైఎస్, కిరణ్ టైంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉంది కానీ, శకటం రిజెక్ట్ అయింది’ అని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

‘రిపబ్లిక్ వేడుకలలో శకటం ఎంపిక విషయం రాజకీయాలకు అతీతమైంది. గత మూడేళ్ళుగా తెలంగాణా శకటం కూడా రిజెక్ట్ అయింది. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాష్ట్ర శకటానికి అనుమతించక పోవడం ఇదే తొలి సారి కాదు.  వై.ఎస్ టైమ్ లో ఒకసారి, కిరణ్ టైమ్ లో మూడుసార్లు మన శకటాలను తిరస్కరించారు’ అని మరో ట్వీట్ లో ప్రస్తావించారు.

More Telugu News