Andhra Pradesh: అగ్రవర్గాలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు.. నిర్ణయాన్ని తప్పుపట్టిన ఒవైసీ!

  • దళితుల కోసం రిజర్వేషన్లు తెచ్చారు
  • పేదరిక నిర్మూలనకు పథకాలు తీసుకురావాలి
  • ఆర్థిక స్థితి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేం

దేశంలోని అగ్రవర్గాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో రేపు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో అగ్రవర్గాల ఓట్లను దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ పావును కదిపింది. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం తీరును తప్పుపట్టారు.

ఈరోజు ట్విట్టర్ లో ఒవైసీ స్పందిస్తూ.. ‘దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చు. కానీ రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినది. ఆర్థిక కారణాల ఆధారంగా రాజ్యాంగం రిజర్వేషన్లను ఇవ్వలేదు’ అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కేంద్రం 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలులేదు.

More Telugu News