Black magic: దారుణాతి దారుణం.. తల్లిని చంపి రక్తం తాగిన కొడుకు!

  • క్షుద్రపూజల మత్తులో దారుణం
  • కళ్లారా చూసి వణికిపోయిన హతురాలి స్నేహితురాలు
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

ఇది మామూలు దారుణం కాదు.. కఠినాత్ములు సైతం వణికిపోయే దారుణం. చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో గత నెల 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది. విషయం తెలిసిన వారు కూడా భయంతో వణికిపోతున్నారంటే అదెంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. క్షుద్రపూజల మైకంలో నిండా మునిగిపోయిన ఓ కుమారుడు కన్నతల్లిని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమె నుంచి స్రవిస్తున్న రక్తాన్ని గడగడా తాగేశాడు.

తల్లి సమరియా (50)ను ఆమె కుమారుడు దిలీప్ యాదవ్ నరుకుతున్నప్పుడు చూసిన ఆమె స్నేహితురాలు సమీరన్ యాదవ్ భయంతో వణికిపోయింది. ఎవరికి చెప్పాలో, చెబితే ఏమవుతుందో తెలియక భయంతో ఆ భయంకర నిజాన్ని తనలోనే దాచుకుంది. చివరికి ఈ నెల 3న ధైర్యం కూడగట్టుకుని తొలుత తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అనంతరం గ్రామ పెద్దలకు, వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దిలీప్ కోసం గాలింపు మొదలుపెట్టారు.

More Telugu News