sabbam hari: కేసీఆర్ అబద్ధాలు చెబుతారనేదానికి ఇదొక ఉదాహరణ: సబ్బం హరి

  • చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి కొనసాగుతుందని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు
  • బీజేపీ అధికారంలోకి రావాలని ఎవరూ కోరుకోవడం లేదు
  • చంద్రబాబు విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు

ఏపీలో మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి కొనసాగుతుందని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారని సబ్బం హరి తెలిపారు. చంద్రబాబు స్థానంలో మరొకరు సీఎం అయితే, అభివృద్ధి తిరోగమిస్తుందని భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును అడ్డుకునేందుకు ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఫలించబోవని చెప్పారు. చంద్రబాబు విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. జగన్ సీఎం కావాలని కొందరు, పవన్ ముఖ్యమంత్రి కావాలని మరికొందరు కోరుకుంటున్నారని... అయితే ఎంత శాతం మంది కోరుకుంటున్నారనే విషయం ఎన్నికల్లో తెలుస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని తెలిపారు.

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సబ్బం హరి నిప్పులు చెరిగారు. విశాఖపట్నంకు వెళ్లినప్పుడు వేల మంది, లక్షల మంది డాబాలపై నిల్చుని తనకు స్వాగతం పలికారని... చంద్రబాబును ఓడించి మంచి పని చేశారని తనతో చెప్పారని కేసీఆర్ ఇటీవల చెప్పుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు తాను ఒకటి చెప్పదలుచుకున్నానని... తెలంగాణలో మీరు ఏం చేశారో, ఎన్ని అబద్దాలు చెబుతున్నారో తనకు అవసరం లేదని... విశాఖలో మీకోసం వేల మంది వచ్చారని చెప్పుకోవడం కంటే పెద్ద అబద్ధం లేదని అన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెబుతారనేదానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.

More Telugu News