Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు... మధ్యవేలికి ఇంక్ గుర్తు!

  • ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
  • చూపుడువేలికి ఇంకు చుక్క
  • ఇంకా చెరిగిపోని కారణంతో మధ్యవేలికి

తెలంగాణకు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రజలకు, ఎడమచేతి మధ్యవేలికి సిరా గుర్తుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వేళ, చూపుడువేలుకు పెట్టిన సిరా ఇంకా చెరిగిపోని కారణంతోనే పంచాయతీ ఎన్నికల్లో మధ్యవేలికి గుర్తును పెట్టాలంటూ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రాథమికంగా 35 గుర్తులను ఈసీ కేటాయించింది. సర్పంచి పదవికి పోటీ పడే అభ్యర్థులకు 20, వార్డు సభ్యులకు 15 గుర్తులను కేటాయించింది. సర్పంచి అభ్యర్థులుగా పోటీ పడేవారికి బుట్ట, ఉంగరం, కత్తెర, కుట్టుమిషన్‌, బ్యాట్‌, పలక, బల్ల, బ్యాటరీ లైటు, బ్రష్‌, క్యారెట్‌, టేబుల్‌ బల్బు, దూరదర్శిని, చేతికర్ర, షటిల్‌, మొక్క జొన్న, నగరా, దువ్వెన, మంచం, కప్పుసాసరు, కొవ్వొత్తిని కేటాయించింది.

ఇక వార్డు సభ్యులు విద్యుత్‌ స్తంభం, గ్యాస్‌ పొయ్యి, హార్మోనియం, టోపీ, ఇస్త్రీ పెట్టె, పోస్టుబాక్సు, ఫోర్క్‌, చెంచా, జగ్గు, గౌను, స్టూలు, బీరువా, ప్రెషర్‌ కుక్కర్‌, ఐస్‌క్రీమ్, కెటిల్‌ గుర్తుల నుంచి తమకు కావాల్సిన గుర్తును ప్రాధాన్యతా పూర్వకంగా ఎంచుకోవచ్చు.

More Telugu News