Uttar Pradesh: గో సంరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • లాభదాయక కార్పొరేషన్‌ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించాలని నిర్ణయం
  • పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌ ఏర్పాటు
  • ఒక్కోదానిలో వెయ్యి పశువులకు సంరక్షణ

గోవుల సంరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని  ఎక్సైజ్‌, ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించడానికి కేబినెట్‌ ఆమోదించింది. ‘గో సంరక్షణ సెస్‌’ పేరుతో దీన్ని అమలు చేస్తారు. పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా ‘గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌’లను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు నిర్మిస్తారు.

ఒక్కో షెడ్డులో వెయ్యి పశువులకు ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంరక్షించే స్తోమత లేక చాలా మంది రైతులు తమ పశువులను వదిలేస్తున్నారని, ఇలాంటి షెడ్ల వల్ల వాటికి ఆశ్రయం లభిస్తుందన్నారు. అలాగే రోడ్లపై తిరిగే పశువులకు కూడా ఆశ్రయం కల్పించినట్లవుతుందని చెప్పారు. సంబంధిత విభాగాలు పరస్పర సహకారంతో ఆవుల సంరక్షణ చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. 

More Telugu News