Mancherial District: కన్నబిడ్డనే కాటికి పంపింది...భర్తపై కోపంతో ఓ మహిళ అమానుషం

  • ఇంట్లో ఎవరూ లేనప్పుడు పీకనులిమి హత్య
  • గతంలోనూ పలుమార్లు ప్రయత్నం
  • తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఘటన

భర్తపై ఉన్న కోపం ఆమె కడుపు తీపిని చంపేసింది. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డను కాటికి పంపింది. బొడ్డు తెంచుకుని పుట్టిన బిడ్డ గొంతు నులిమి హత్య చేసింది. అత్యంత విషాదకర ఈ అమానుష ఘటన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కొమ్మూగూడెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...గ్రామానికి చెందిన దుర్గం శంకరయ్య, దుర్గలు దంపతులు. వీరికి మూడేళ్ల కొడుకు అంజన్న ఉన్నాడు. శంకరయ్య పశువులు కాపరిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏ కారణంగానో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో దుర్గ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడుకు గొంతు నులిమి చంపేసింది. గతంలోనూ గొడవ జరిగినప్పుడల్లా ఇటువంటి ప్రయత్నం చేసేదని శంకరయ్య చెబుతున్నాడు. పశువులు కాయడానికి బయటకు వెళ్లిన శంకరయ్య సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. కొడుకు కనిపించక పోవడంతో భార్యను అడిగాడు. ఆమె సమాధానం చెప్పక పోవడంతో గట్టిగా నిలదీశాడు. దీంతో ఘోరాన్ని వెల్లడించడంతో భోరుమన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించారు.

More Telugu News