Madhya Pradesh: చేతిపై 'సారీ' అని రాసుకుని... ఆపై ఆత్మహత్య చేసుకున్న యువకుడు!

  • పోటీ పరీక్షల పేరిట తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ధన్ రాజ్
  • మిత్రుడు వచ్చి చూసేసరికి ఆత్మహత్య
  • కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానంటూ తల్లిదండ్రులను వీడి బయటకు వచ్చి ఉంటున్న ఓ యువకుడు, తన చేతిపై బ్లేడ్ తో 'సారీ' అని రాసుకుని ఆత్మహత్యకు పాల్పడటం, మధ్యప్రదేశ్‌ లోని బైతూల్‌ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ముల్తాయీ సమీపంలోని కాజలీ గ్రామానికి చెందిన ధన్‌ రాజ్ బాన్ఖడే (28) తన మిత్రుడు చందూ నర్వరేతో కలసి బైతూల్ లో ఓ గది తీసుకుని ఉంటూ చదువుకుంటున్నాడు.

ఏం జరిగిందో ఏమోగానీ, చందూ డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చేసరికి రాజ్, ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతను 100కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు, మృతదేహాన్ని కిందకు దింపించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని అన్నారు. ఈ గదిలో ఓ మద్యం బాటిల్, తినుబండారాల ప్యాకెట్ కూడా లభ్యమయ్యాయని, అతని చేతిపై బ్లేడ్ తో 'సారీ' అని చెక్కుకున్నాడని అన్నారు. మృతుడు మద్యం తాగి, ఈ పని చేసివుంటాడని భావిస్తున్న పోలీసులు, ఆత్మహత్య వెనుక కారణాల అన్వేషణలో పడ్డారు.

More Telugu News