Telangana: కేసీఆర్ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక వైసీపీని విమర్శిస్తారా?: చంద్రబాబుపై భూమన ఆగ్రహం

  • చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన భూమన
  • హోదా కోసం వైసీపీనే పోరాడుతోందని వ్యాఖ్య
  • చంద్రబాబుకు ఏపీ ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరిక

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలకు మారుపేరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ మాత్రమే మొదటి నుంచి పోరాడుతోందని తెలిపారు. హోదాకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి ముందుకు వెళతామని గతంలోనే ప్రకటించామన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భూమన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ బానిస రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని చంద్రబాబు వైసీపీని విమర్శించడం ఏంటని భూమన ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారశైలి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి అవకాశవాద రాజకీయ నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనీ, అందుకు ఎంతయినా ఖర్చు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీ అధినేతకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

More Telugu News