Chandrababu: ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారు: భూమన కరుణాకరరెడ్డి

  • చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు
  • ఆరువందల హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదు
  • అనుభవాన్నంతా స్వార్థం కోసమే వినియోగించారని విమర్శ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వేళ ఆరువందల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు.

రైతులు, డ్వాక్రా మహిళలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ మోసం చేశారని ఆరోపించారు. తన అనుభవాన్నంతా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించిన చంద్రబాబు ఇప్పుడు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని బాబు చెప్పుకున్నా ప్రజలు నమ్మరన్నారు. ఇప్పటికే వారో నిర్ణయానికి వచ్చేశారని, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు.

More Telugu News