Ghazipur: ప్రధాని ర్యాలీ నుంచి వస్తున్న కానిస్టేబుల్‌ను రాళ్లతో కొట్టి చంపిన ఆందోళనకారులు

  • బరేలీలో ప్రధాని ర్యాలీ
  • విధులు ముగించుకుని వస్తుండగా ఘటన
  • తీవ్రంగా స్పందించిన సీఎం యోగి

ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీలో విధులు నిర్వహించి వస్తున్న కానిస్టేబుల్‌ను నిషాద్ పార్టీకి చెందిన ఆందోళనకారులు రాళ్లతో కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజీపూర్‌లో జరిగిందీ ఘటన. శనివారం బరేలీలో ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ విధులు పూర్తయిన అనంతరం వెనక్కి వస్తున్న కానిస్టేబుల్ సురేంద్ర వత్స్‌ను నిషాద్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో కొట్టి చంపారు. ప్రధాని ర్యాలీలో పాల్గొని వస్తున్న స్థానిక బీజేపీ నేతల వాహనాలపైనా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు.

ఇదే ర్యాలీలో పాల్గొన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలను ఆదేశించారు. మృతి చెందిన కానిస్టేబుల్ భార్యకు రూ. 40 లక్షలు, అతడి తల్లిదండ్రులకు రూ. 10 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

ప్రధాని ర్యాలీకి, ఈ హింసకు ఎటువంటి సంబంధం లేదని యూపీ డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. రోడ్లను దిగ్బంధం చేసినందుకు అరెస్ట్ చేసిన నలుగురు కార్యకర్తలను వదిలిపెట్టాలనే డిమాండ్‌తోనే నిషాద్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్టు చెప్పారు.

More Telugu News