Tirumala: లభించని చిన్నారి వీరేష్‌ ఆచూకీ... తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

  • తిరుమల కొండపై ఏడాదిన్నర బాలుడిని ఎత్తుకెళ్తిన గుర్తు తెలియని వ్యక్తి
  • నిద్రిస్తున్న బాలుడిని అపహరించిన దుండగుడు
  • బాధిత కుటుంబానిది మహారాష్ట్రలోని లాథూర్‌

తిరుమల కొండపై బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా మంకీ క్యాప్‌ ధరించిన వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం వేట మొదలుపెట్టారు. మహారాష్ట్రలోని లాథూర్‌ నుంచి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన ప్రశాంత్‌, దాలింబాయ్‌ దంపతుల కొడుకు వీరేష్‌.

శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రశాంత్‌ కుటుంబం గది దొరక్క పోవడంతో యాత్రి సముదాయం-2కు ఎదురుగా ఉన్న షెడ్‌లో సేదదీరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజీ పరిశీలించారు. అతను ఎక్కడి వరకు వెళ్లగలడన్న అంచనాకు వచ్చిన పోలీసులు ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్‌ చేశారు. బిడ్డతోపాటు నిందితుడు ఫొటోతో కరపత్రాలు ముద్రించి అన్ని బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో అంటించారు. రోజు గడిచినా బిడ్డ ఆచూకీ లభించక పోవడంతో బాధిత కుటుంబం తల్లడిల్లిపోతోంది. బిడ్డ తిరిగి వస్తాడన్న గంపెడాశతో ఎదురు చూస్తోంది.

More Telugu News