40 years industry: నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదు!: చంద్రబాబు

  • మోదీని నేను ఎంతగానో గౌరవించా
  • కానీ ఆంధ్రాకు అన్యాయమే చేశారు
  • ఉక్కు కర్మాగారాన్ని సైతం అడ్డుకున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6న ఏపీకి రానున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. తాను ప్రధాన మంత్రి మోదీని ఎంతగానో గౌరవించానని చంద్రబాబు తెలిపారు. కానీ ఆయన ఆంధ్రాకు అన్యాయం చేశారని వాపోయారు. రాష్ట్రం అభివృద్ధి కోసం తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏనాడూ ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదని చంద్రబాబు అన్నారు.

ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పిన కడప ఉక్కు కర్మాగారాన్ని సైతం కేంద్రం నిర్మించలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. అందుకే ఉక్కు సంకల్పంతో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి, పూర్తిచేసే బాధ్యతను తీసుకుంటున్నామని తెలిపారు. విద్యాసంస్థల కోసం భూములు కేటాయించినా కేంద్రం నిర్మించడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. విమానాశ్రయాల విస్తరణను కూడా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు వెళదాం, కలిసి పనిచేద్దాం అనుకుంటే తెలంగాణ సహకరించలేదని వాపోయారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News