మిషన్ భగీరథ పైప్ లైన్ లో పాము.. భయాందోళనలలో గ్రామస్తులు!
- రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన
- మంచి నీటిలో చనిపోయిన పాము
- అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న స్థానికులు
జిల్లాలోని చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలో గత 30 రోజులుగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న మధ్యాహ్నం నీళ్లు వస్తుండగా, ఒక్కసారిగా వాల్వ్ నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో నీళ్లు పట్టుకుంటున్న స్థానికులు భయాందోళనలకు లోనయి పరుగులు తీశారు.
ఈ సందర్భంగా పామును పైప్ నుంచి బయటకు తీయగా, అది అప్పటికే చనిపోయింది. ఈ నేపథ్యంలో ట్యాప్ ద్వారా వస్తున్న నీటిని తాగేందుకు ప్రజలు భయపడుతున్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తున్నారు.