Hyderabad: హరీశ్ రావును పొగడ్తలతో ముంచెత్తిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే!

  • హైదరాబాద్ లో వర్క్ షాప్
  • పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు
  • ఏపీ నుంచి హాజరైన బోడె ప్రసాద్
  • హరీశ్ చక్కగా పనిచేస్తున్నారని కితాబు

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బోడె ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీశ్ రావుపై పొగడ్తల వర్షం కురిపించారు. గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడమన్న అంశంపై హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరిగిన వర్క్ షాప్ కు, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 40 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా, ఏపీ నుంచి బోడె ప్రసాద్ ఒక్కరే వచ్చారు.

ఇక వర్క్ షాప్ నకు వచ్చిన ఎమ్మెల్యేలను సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ కు తీసుకెళ్లిన హరీశ్ రావు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి స్వయంగా వివరించారు. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయిన బోడె, తన అసెంబ్లీ నియోజకవర్గంలో 10 గ్రామాలను ఎంపిక చేసుకుని ఇలాగే మారుస్తానని అన్నారు. హరీశ్ రావు చాలా సింపుల్ గా ఉన్నారని, అర్థరాత్రి ఫోన్ చేసినా పలుకుతారని వ్యాఖ్యానించారు.

ఎవరికి కష్టం వచ్చినా, హరీశ్ రావు వెంటనే వస్తారని ఇబ్రహీంపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యేల బృందానికి చెప్పారట. దీనిపై హరీశ్ రావుతో బోడె ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణలో చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఇదే సమయంలో పెనమలూరు ప్రాంతంలో ఆవుల కోసం ఊరిబయట వేసిన షెడ్లకు 'గోకులం' అని పేరు పెట్టామని బోడె ప్రసాద్ చెప్పగా, చంద్రబాబు మంచి మంచి పేర్లు చక్కగా పెడతారని హరీశ్ రావు అనడంతో నవ్వులు విరిశాయి.

More Telugu News