ramasethu: రామసేతును నేరుగా దర్శించవచ్చు...ధనుష్కోడి వరకు రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్రం ఓకే

  • ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్న రామసేతు వారధి
  • ప్రస్తుతం రామేశ్వరం వరకే రైలు మార్గం
  • అదనంగా మరో 17 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయం

రామరావణ యుద్ధం సందర్భంగా శ్రీరాముని ఆజ్ఞ మేరకు వానర సైన్యం నిర్మించిందని భావిస్తున్న రామసేతు మన వైపు గట్టును సందర్శించే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత భూభాగంలో రామసేతు ప్రారంభమవుతున్న ధనుష్కోడి వరకు రైల్వేలైను నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ వరకు రామసేతు నిర్మితమై ఉందన్నది అనాదిగా వున్న నమ్మకం. పంబన్‌ దీవిలోని రామేశ్వరం వరకు ప్రస్తుతం రైల్వే లైను ఉంది. దీన్ని ధనుష్కోడి వరకు పొడిగించాలని నిర్ణయించారు.

రామేశ్వరం నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతానికి రైల్వేలైను అందుబాటులోకి వస్తే యాత్రికులు సులభంగా రామసేతును సందర్శించవచ్చు. వాస్తవానికి గతంలో ధనుష్కోడి  వరకు రైల్వేలైను ఉండేది. 1964లో వచ్చిన భీకర తుపాన్‌ సమయంలో ఈ లైను ధ్వంసమయింది. ధనుష్కోడి గ్రామం కూడా చరిత్రపుటల్లో కలిసిపోయింది. అంటే పాత రైల్వే మార్గాన్ని పునర్నిర్మిస్తున్నట్టే లెక్క. ఇక, మండపం నుంచి పంబన్‌ ద్వీపాన్ని కలుపుతూ ప్రస్తుతం ఉన్న రైల్వే వంతెనను ఆనుకుని కొత్త  వంతెన నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న వంతెనకు సమాంతరంగా 249 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు.

More Telugu News