Tamilnadu: ఫేస్ బుక్ ప్రియుడి కోసం... కన్నతల్లిని హత్య చేసిన బీకామ్ విద్యార్థిని!

  • తమిళనాడులోని తిరువళ్లూరు ప్రాంతంలో ఘటన
  • దేవీప్రియకు ఏపీ యువకుడు సురేశ్ తో పరిచయం
  • విషయం తెలిసి మందలించిన తల్లి
  • ఇతర స్నేహితులతో కలిసి హత్య చేసిన యువతి

తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడ్డ ఓ బీకామ్ విద్యార్థిని, తన ప్రేమకు అడ్డు చెప్పిందన్న కారణంతో ఇతర స్నేహితులతో కలిసి కన్నతల్లినే  హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కాకలూరులో కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తిరుమురుగన్‌, భానుమతి దంపతుల కుమార్తె దేవీప్రియ (19) బీకామ్‌ సెకండియర్ చదువుతుండగా, ఆమెకు నెల్లూరు జిల్లా తడకు చెందిన సురేశ్‌ అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వారిద్దరి మధ్యా ప్రేమగా మారగా, విషయం భానుమతికి తెలిసింది.

దీంతో దేవీప్రియను ఆమె మందలించగా, తన ప్రేమకు అడ్డుగా వున్న తల్లిని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఫేస్‌ బుక్‌ లోనే పరిచయమైన తంజావూరుకు చెందిన అజిత్‌ కుమార్‌, కుంభకోణానికి చెందిన విఘ్నేశ్‌ లను దేవీప్రియ సంప్రదించింది. వారితో కలసి తల్లిని చంపేందుకు ప్లాన్‌ వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కాకలూరుకు వచ్చిన అజిత్‌, విఘ్నేశ్‌ భానుమతిని కత్తులతో పొడిచి చంపేశారు. వీరిని పసిగట్టిన స్థానికులు, దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News