Karnataka: తన పార్టీ నేత హత్యతో నోరు జారిన సీఎం కుమారస్వామి!

  • దారుణ హత్యకు గురైన ప్రకాశ్
  • దోషులను కాల్చి పారేయాలన్న కుమారస్వామి
  • వీడియో వైరల్ కావడంతో వివరణ

జనతాదళ్‌ (ఎస్‌)కు చెందిన ఓ నేత దారుణ హత్యకు గురి కాగా, విషయం తెలుసుకున్న సీఎం కుమారస్వామి నోరుజారారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది. హొణ్నలగెరె ప్రకాశ్‌ అనే నేతను నిన్న సాయంత్రం బైక్ పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు, మద్దూర్‌ వద్ద అడ్డుకుని విచక్షణా రహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాల పాలైన ప్రకాశ్, చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై స్పందించిన కుమారస్వామి, దోషులను పట్టుకుని కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ ఆదేశించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సీఎం వైఖరిపై విమర్శలు వచ్చాయి. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కుమారస్వామి, ఓ మరణాన్ని చూసిన ఆగ్రహంతో ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప, పోలీసులకు ఇచ్చిన ఆదేశాలుగా వాటిని భావించరాదని అన్నారు. ప్రకాశ్ ను హత్య చేసిన వారు, గతంలో రెండు హత్య కేసుల్లో నిందితులని, వారు ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చారని తెలిపిన కుమారస్వామి, నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని అన్నారు.

More Telugu News