aeroplane: విమానం చార్జీలే కాదు... అందులో ఫోన్‌ వినియోగం ఖర్చూ అధికమే!

  • శాటిలైట్‌ ఫోన్‌/నెట్‌ వినియోగానికి గంటకు 500 రూపాయలు
  • ప్రపంచ దేశాతో పోల్చితే మనవద్ద చార్జీలు అధికమే
  • శాటిలైట్‌ బ్యాండ్‌ విడ్త్‌ వ్యయం అధికంగా ఉండడమే కారణం

విమాన చార్జీలే కాదు, ప్రయాణం సందర్భంగా విమానంలో ఫోన్‌ వాడాలన్నా ఖర్చుతో పనే. గంటసేపు ఫోన్‌ లేదా నెట్‌ వినియోగించుకోవాలంటే దాదాపు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. విమాన ప్రయాణంలో ఫోన్‌ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. లోహవిహంగంలోకి ప్రవేశించగానే ఫోన్‌ ఏరోప్లేన్‌ మోడ్‌లో పెట్టాల్సిందే. విమానం పైలట్‌కు అందే సిగ్నల్స్‌లో ఎటువంటి అంతరాయం, సందిగ్ధం ఏర్పడకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. అయితే ఎక్కువ గంటలపాటు విమాన ప్రయాణంలోనే గడపాల్సిన సమయంలో అత్యవసరం, తప్పనిసరైన వారి పరిస్థితి ఏమిటి? దీనికి పరిష్కారమే శాటిలైట్‌ ఫోన్‌.

కానీ ఇందుకు అయ్యే వ్యయం అధికమని దేశీయ పరిధిలో విమానాలు, నౌకల్లో మొబైల్‌ సేవలు అందించే లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసిన హ్యూస్‌ ఇండియా చీఫ్‌ టెక్నాజీ ఆఫీసర్‌ కె.కృష్ణ తెలిపారు. ప్రపంచంలో ఇదే సదుపాయం అందుబాటులో ఉన్న ఇతర దేశాలతో పోల్చితే శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ చార్జీలు మన దగ్గర ఏడు నుంచి ఎనిమిది రెట్లు అధికంగా ఉండడమే  ఇందుకు కారణమని తెలిపారు. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ (ఇస్రో) నుంచి మాత్రమే బ్యాండ్‌ విడ్త్‌ కొనుగోలు చేయాలన్న నిబంధన కూడా మరో కారణమని వివరించారు. ధరలు అందుబాటులో ఉంటేనే ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకుంటారని, శాటిలైట్‌ బ్యాండ్‌ విడ్త్‌ను ఎవరి వద్ద నుంచైనా తీసుకునే సదుపాయం కల్పించినప్పుడే ఇది సాధ్యమవుతుందని కృష్ణ వెల్లడించారు.

More Telugu News