Andhra Pradesh: చంద్రబాబు చైనీయుడిగా మారిపోతాడని భయం వేస్తోంది!: వైసీపీ నేత ఆనం

  • చిత్తూరు జిల్లాపైనా, శ్రీవారిపైనా అంత కోపం ఎందుకు?
  • నెల్లూరు, చిత్తూరులో సిలికాను ఇప్పటికే దోచేశారు
  • బ్లాక్ పేపర్లను త్వరలోనే విడుదల చేస్తాం

శ్రీ వేంకటేశ్వర స్వామితో పాటు జన్మనిచ్చి, చదువు చెప్పి ఈ స్థాయికి తీసుకొచ్చిన చిత్తూరు జిల్లాపై అంత కోపం ఎందుకో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పాలని వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుపతి పేరును మార్చి సిలికాన్ సిటీగా పెడతామని చెబుతున్నారనీ, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సిలికా ఖనిజాన్ని టీడీపీ నేతలు ఇప్పటికే దోచేశారని ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎక్కడికి పోయినా అక్కడి అవతారం ఎత్తడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు రేపు చైనాకు వెళితే చైనీయుడిగా మారిపోతాడన్న భయం తనతో పాటు ఏపీ ప్రజలందరికీ ఉందని వంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ విడుదల చేసే శ్వేతపత్రాలకు ఏమాత్రం విలువ లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే తాము బ్లాక్ పేపర్లను విడుదల చేస్తామనీ, వాటికి సమాధానం చెప్పాకే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

More Telugu News