KCR: మొన్న కేసీఆర్‌ను తిట్టారు.. ఇప్పుడాయన బూట్లు నాకేందుకు సిద్ధమవుతున్నారు: పిడమర్తి రవి

  • మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు
  • ఇప్పుడు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు
  • ఇటువంటి వారితో జాగ్రత్త

ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టిన కొందరు నాయకులు ఇప్పుడు ఆయన బూట్లు నాకేందుకు సిద్ధమవుతున్నారని టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి  కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి సహా పలువురు టీఆర్ఎస్ నేతలను ప్రతిపక్ష పార్టీ నేతలు తిట్టిపోశారని, ఇప్పుడు వారే కేసీఆర్ బూట్లు నాకేందుకు రెడీ అవుతున్నారని మండిపడ్డారు. మాట మీద నిలబడలేని నాయకులు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారన్న ఆయన.. వారంతా ఇప్పుడు ప్రగతి  భవన్ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

మాయమాటలు చెప్పేవారు మనతో జత కలవాలని చూస్తున్నారని, అటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కప్పుకున్న పార్టీ కండువా రంగు మారకముందే పార్టీ ఫిరాయింపులకు సిద్ధమవుతున్నారని రవి ఆరోపించారు. ఇటీవలి ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి బరిలోకి దిగిన పిడమర్తి రవి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. శనివారం సత్తుపల్లిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో రవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News