special trains: జనవరి, ఫిబ్రవరి నెలల్లో హైదరాబాద్‌-గుంటూరు మధ్య 'సండే స్పెషల్' రైలు

  • దక్షిణ మధ్య రైల్వే సీనియర్‌ డీసీఎం వెల్లడి
  • ఒక టూ టైర్‌, మూడు త్రీ టైర్‌, ఏడు స్లీపర్‌, ఐదు జనరల్‌ బోగీలు
  • తిరుపతి-నాగర్‌సోల్‌ మధ్య కూడా ప్రత్యేక రైలు

రైలు ప్రయాణికులకు శుభవార్త. గుంటూరు-హైదరాబాద్‌ మధ్య ప్రతి ఆదివారం ఓ ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. ఒక టూ టైర్‌, మూడు త్రీ టైర్‌, ఏడు స్లీపర్‌, ఐదు జనరల్‌ బోగీలు ఈ రైలులో అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్‌ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. 07258 నంబరుగల ఈ రైలు జనవరి 6, 13, 20, 27  తేదీల్లోను, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లోను నడుస్తుందని పేర్కొన్నారు.

సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి రాత్రి పదకొండు గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరిగి 11.30 గంటలకు బయలుదేరి మరునాడు తెల్లవారు జామున 4.45 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. అలాగే తిరుపతి-నాగర్‌సోల్‌ మధ్య కూడా ప్రత్యేక రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 07417 నంబరుగల ఈ రైలు జనవరి 4, 11, 18, 25 తేదీల్లోను, ఫిబ్రవరి 1,8, 15, 22 తేదీల్లోను నడవనుంది. అలాగే 07418 నంబరు రైలు జనవరి 5, 12, 19, 26 తేదీల్లోను, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లోను రాకపోకలు జరుపుతుంది.

More Telugu News