Chandrababu: నాడు ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాలన్నింటినీ చంద్రబాబు స్తంభింపజేశారు: లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్ కు బాబు చేసిన ద్రోహాన్ని చరిత్ర మరిచిపోదు
  • నాడు ఎన్టీఆర్ ను పలు విధాల బాబు అవమానించారు
  • టీడీపీని రాహుల్ కాళ్ల దగ్గర పడేశారు

నాడు ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాలన్నింటిని చంద్రబాబు స్తంభింపజేసి ఒక్క రూపాయి కూడా ఆయనకు అందకుండా చేశారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని చరిత్ర మరిచిపోదని, నాడు ఎన్టీఆర్ ను అనేక విధాలుగా చంద్రబాబు అవమానించారని అన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన బాబు రాజకీయ హంతకుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని రకాలుగా ఎన్టీఆర్ కు ద్రోహం చేశారని, ఎన్టీఆర్ పేరిట ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, ఆయన ఆశయాలను నాశనం చేశారని మండిపడ్డారు.

అవినీతికి కేంద్ర బిందువుగా టీడీపీని మార్చిన ఘనత చంద్రబాబుదని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాడు స్థాపించిన టీడీపీని, బాబు తన స్వార్థం కోసం ఆ పార్టీని రాహుల్ కాళ్ల దగ్గర పడేశారని ఘాటుగా విమర్శించారు. ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదును ఇంతవరకూ ఎందుకు సాధించలేకపోయారని చంద్రబాబుని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో సైకిల్ చక్రం గాలిపోయిందని, పొత్తులు లేకుండా ఒంటరిగా గెలవలేని అథమస్థాయికి చంద్రబాబు చేరారని అన్నారు. ఏపీలో ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఢిల్లీ చుట్టూ 29 సార్లు తిరిగానని చెబుతున్న చంద్రబాబు, ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని మరోసారి విమర్శించారు.  

More Telugu News