Chittoor: మిస్టర్ మోదీ... ప్రజా వంచకుడివి నువ్వు: వీరపాండ్య కట్టబొమ్మనగా ప్రత్యక్షమైన చిత్తూరు ఎంపీ!

  • మాట నిలుపుకోలేని దౌర్భాగ్యుడివి
  • చంద్రబాబును మోసం చేశావు
  • నిధులడిగితే మట్టి, నీళ్లు ముఖాన కొడతావా?
  • మోదీకి పాపం చుట్టుకుంటుందన్న శివప్రసాద్

"మిస్టర్ మోదీ... నువ్వు ప్రధానమంత్రివా? ప్రజా వంచకుడివా? వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యుడివి నువ్వు. స్నేహధర్నం లేదు... స్నేహం విలువ తెలియదు. ఆపన్న హస్తం అందించిన చంద్రబాబునాయుడిని ప్రత్యేక హోదా అని, ప్యాకేజీ అని మాటలు మార్చి మార్చి మోసం చేశావు. ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేశావు. రాజధానికి నిధులివ్వమని అంటే... మట్టీ నీళ్లు తెచ్చి ముఖాన కొడతావా?

ఏమయ్యా... విశాఖ రైల్వే జోన్ ఎవడబ్బ సొత్తు? కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రకటన చేయకపోవడం నీ అహంకారానికి గుర్తు. మోదీ... అర్ధరాత్రి, అకస్మాత్తుగా చలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేశావు. పిచ్చి తుగ్లక్ మాదిరిగా. నల్ల ధనాన్ని వెలికి తీసి, ప్రతి బ్యాంకు ఎకౌంట్ లో 15 లక్షలు వేస్తానన్న నీ ప్రగల్బాలు ఏమయ్యాయి? బ్యాంకులో డబ్బుండి, డ్రా చేసుకోవడానికి ఏటీఎంల దగ్గర నిలబడి నిలబడి నిలబడి ఎంత మంది చచ్చి పోయారో నీకు తెలియదా?

నిర్ణయించబడిన పెళ్లిళ్లు ఎన్ని ఆగిపోయాయో... వాటి పాపం నీకు చుట్టుకోదా? ఏమయ్యా... వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బును ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకుంటావా? ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా నీకు? నీకు ముస్లింలంటే గౌరవం లేదు. ఊచకోత కోస్తావు. రైతులంటే మర్యాదలేదు. గిట్టుబాటు ధరల కోసం ప్రకటన చేయమని నిన్ను అర్ధిస్తే, ఢిల్లీ పురవీధుల్లో వాటర్ క్యాన్ లతో తరిమితరిమి కొట్టావు. ఎవరైనా ఎదురు తిరిగితే ఈడీలతో దాడి చేయించి బేడీలు వేస్తారా? ఈ సంకెళ్లు ఏం చేస్తాయి? ఈ సంకెళ్లే సమరశంఖాలై నీ మెడకు చుట్టుకుంటాయి. నీ పతనానికి దారి తీస్తాయి. 2019 నీ చివరి ఎన్నికలు. అడ్రస్ లేకుండా పోతావ్" అని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రోజుకో కళారూపంతో వచ్చి నిరసనలు తెలుపుతూ, తనదైన శైలిలో విమర్శలు గుప్పించే శివప్రసాద్, నేడు వీరపాండ్య కట్ట బొమ్మన రూపంలో వచ్చారు. బ్రిటీష్ వారిపై పోరాడిన యోధుడిగా, నేడు మోదీపై పోరాడేందుకు తాను వచ్చానని ఆయన అన్నారు.

More Telugu News